Thursday, May 19, 2011

శ్రీ దుర్గా సర్వస్వము – శ్రీ దుర్గా అమ్మవారి ఆలయస్థాపనలో శ్రీ బీరక శివప్రసాదరావు గారి దివ్యానుభూతులు



ముందుమాట
డా. బీరక శివప్రసాదరావుగారితో మొదటి పరిచయం అమ్మ కార్యక్రమంతోనే. శ్రీమతి పవని నిర్మలప్రభావతిగారి లలితాసహస్రనామావళి వ్యాఖ్యానగ్రంధావిష్కరణ సభలో వారు ముఖ్య అతిధి అయితే నేను వక్తను. ఆనాడు మ మ్మెందుకు కల్పిందో ఇప్పుడు అర్థమవుతోంది. ఆనాటినుండి మా మైత్రి దినదినాభివృధ్ధి అయింది. వారు మంచి స్నేహశీలి. వారి పరిథిలోకి ఎవరు వచ్చినా అలా నిలిచిపోతారు. వారి నిష్కపట వైఖరే అందుకు కారణం. వారి మిత్రశక్తి వెనుక మరో రహస్యం ఉంది. దేవతల శక్తులే వారి భార్యలు. నిజానికి ప్రతి పురుషునికి వెనుక శక్తి వారి భార్యయే. మిత్రశక్తి పూర్ణులయిన శివప్రసాద్ గారి భార్యపేరు సుమిత్ర.


చదుకుకొనే రోజులనుండి డాక్టరుగారు ఆధ్యాత్మిక విషయంలో మంచి జిజ్ఞాసువు. వారి యిల్లొక ఆధ్యాత్మిక గ్రంధాలయం. ఇప్పటికీ రాత్రి ఒంటిగంట, రెండుదాకా గ్రంధపఠనంలోనే ఉంటారు. వారి ఆధ్యాత్మిక స్థాయి చాలమందికి తెలియదు. అమ్మవారి ప్రతిష్టలలో వసిష్టులను మాట్లాడటానికి వెళ్ళినపుడు శ్రీలంకా సుబ్బావధానులుగా రొక వేదమంత్రం ఉచ్చరించారు. వెంటనే డాక్టరుగా’రిది తైత్తిరీయంలోనిది కదా!’ అనేసరికి అవధాన్లుగారు వీరి పరిజ్ఞానాని కాశ్చర్యచకితులయ్యారు. మామధ్య ఆధ్యాత్మిక చర్చ మొదలయితే మాకు సమయం తెలియదు. ఆ సత్సంగమూ మా మైత్రిని దృఢపరచింది.


మేమిర్వురం రాహుమహర్దశలో ఉన్నాం. కాబట్టి దుర్గామాత సేవలో నేనూ దిగాను. వారు ఆబాల్య దుర్గాభక్తులు. రాహువు బాధకుడని నేనంటే, కాదు మంచి మిత్రుడండీ! అనేవారు. అప్పుడు కాదన్నా, దుర్గామాత ఆలయకార్యంలో వారితోబాటు భాగస్వామినవుతున్న నేడు వారి మాటను అంగీకరింపక తప్పదు. ఆలయ నిర్మాణవిషయంలో వారు చూపే శ్రద్ధను, అందుకై వారు పడే శ్రమను వారి పరివారం చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. డాక్టరుగారు చతురాలయ నిర్వహణాదక్షులు. వృత్తిపరంగా వారిది వైద్యాలయం. ప్రవృత్తిపరంగా వారిల్లు ఆధ్యాత్మిక గ్రంధాలయం. దేవాంగపురిలో వారి అధ్యక్షతన గొప్పగా నిర్వహింపబడుతున్నది పెద్ద విద్యాలయం. నీలకంఠపురంలో వారి నిర్వహణలో ఉన్నది అరుణాచలేశ్వరుని దేవాలయం. నేడు ప్రతిష్టమయ్యేది అమ్మ దేవాలయం. ఇది మరీ విశిష్టసేవ. ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమములో వారి అనుభూతులు విన్నప్పుడు ఇది తప్పక మరో మహాశక్తిపీఠం కాగలదనిపిస్తుంది.


వారి దుర్గాసేవలో భాగంగా ఆమెపై ఒక మంచి గ్రంధం వెలువరించాలని అలోచన వచ్చింది. డాక్టరుగారికి చిన్మయమిషన్ తో సన్నిహిత సంబంధం ఉంది. మిషన్ లో మేము యజ్ఞప్రసాదంగా పుస్తకాలు సమర్పించటం ఉంది. అలా ఈ దుర్గాయజ్ఞప్రసాదంగా తల్లినిగూర్చిన ముఖ్యవిషయా లన్నిటితో గ్రంధం సిధ్ధం చేయమని నన్ను కోరారు. దుర్గామాతనుగూర్చి అరుదయిన గ్రంధంగానే ఇది సిద్దమవటం ఆమె దయ. డా.శివప్రసాద్ గారి అనేక సత్కార్య నిర్వహణల వెనుక వారి ధర్మపత్ని సుమిత్రగారి నుండే కాక వారి కుమారుడు డా. విజయభాస్కర్, అహ్మదాబాద్; కుమార్తెలు శ్రీమతి విజయకుమారి,ఫ్లోరిడా, అమెరికా; శ్రీమతి విజయశ్రీ, బెంగుళూరు పూర్తి ప్రోత్సాహం ఉంది. అట్టివారి ధన్య కుటుంబాన్ని దుర్గామాత యోగక్షేమాలతో రక్షింపగలదని ఆశిస్తాను. భక్తులు ఈ గ్రంధాన్ని పూర్తిగా పఠించి అమ్మను సేవంచుకొని ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు గావలసినదిగా కోరుచున్నాను.

ఇట్లు
సుజనప్రియ
అన్నదానం చిదంబరశాస్త్రి

పురాణాలలో దుర్గాదేవి



by Dr Annadanam Chidambara Sastry